కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ బూడిదయ్యారు

9 Feb, 2020 20:30 IST|Sakshi

మిస్సిస్సిప్పి : కళ్ల ముందే తన భార్య, ఆరుగురు పిల్లలు కాలి బూడిదైపోతుంటే వారిని కాపాడలేకపోయిన ఓ తండ్రి ఆవేదన ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది. ఈ విషాద ఘటన శనివారం మిస్సిస్సిప్పిలోని క్లింటన్‌ నగరంలో చోటుచేసుకుంది. కాగా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వివరాలను క్లింటన్‌ నగర ప్రతినిధి మార్క్‌ జోన్స్‌ వెల్లడించారు. ఈ ప్రమాదంలో బాధితుని భార్య బ్రిట్నీప్రెస్లీ(33), పిల్లలు లండన్‌ బ్రూక్‌షైర్‌(15), లేన్‌ ప్రెస్లీ(13), లాసన్‌ ప్రెస్లీ(12), గ్రేసన్‌ ప్రెస్లీ(6), మాల్కమ్‌ ప్రెస్లీ(4), ఫెలిసిటీ ప్రెస్లీ(1) చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ప్రమాదానికి సరైన కారణం ఏంటనేది తెలియదని జోన్స్‌ స్పష్టం చేశారు.

'బహుశా ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుంది. కళ్ల ముందే తన కుటుంబం కాలిపోతుండడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఇల్లంతా మంటలు వ్యాపించి పొగ కమ్ముకోవడంతో లోపలికి వెళ్లడానికి అతనికి సాధ్యపడలేదు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అతన్ని ఆసుపత్రికి తరలించాం' అని జోన్స్‌ పేర్కొన్నాడు. తాము మరునాడు ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇళ్లు మొత్తం పూర్తిగా దగ్దమయిందని జోన్స్‌ తెలిపారు. ఇళ్లు మొత్తం వుడ్‌ప్రేమ్‌తో కట్టడంతోనే ప్రమాద తీవ్రత పెరిగి కుటుంబం మొత్తం మంటల్లో చిక్కుకుందని జోన్స్‌ పేర్కొన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు, వారు వేసుకునే బట్టలు సహా ఇంటి సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని మార్క్‌ జోన్స్‌ వెల్లడించారు.   

మరిన్ని వార్తలు