చంద్రునిపై నడిచిన జాన్‌ యంగ్ మృతి

7 Jan, 2018 22:08 IST|Sakshi

హూస్టన్‌: చంద్రుడిపై రెండుసార్లు నడిచిన వ్యోమగామిగా అందరికీ సుపరిచితుడైన జాన్‌ యంగ్‌(87) మృతిచెందాడు. ఆరుసార్లు అంతరిక్షయానం చేసిన యంగ్‌ మరణించాడన్న వార్తను నాసా తన వెబ్‌సైట్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. జాన్‌ యంగ్‌ మృతి మమ్మల్ని ఎంతగానో బాధించిందంటూ ట్వీట్‌ కూడా చేసింది. 1972లో చంద్రునిపై అడుగుపెట్టిన యంగ్‌.. ఈ ఘనత సాధించిన 12 మందిలో ఒకరిగా నిలిచాడు.  1962లో నాసాతో పనిచేయడం మొదలుపెట్టాడు జాన్‌ యంగ్‌. అయితే యంగ్‌ మృతికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు.

అమెరికా అంతరిక్ష పరిశోధనలో విజయవంతమైన ఆస్ట్రోనాట్‌లలో యంగ్‌ ఒకరు. 1960ల్లో రెండుసార్లు జెమినిలో, రెండుసార్లు అపోలో లూనార్‌ మిషన్లలో, 1980ల్లో రెండుసార్లు స్పేస్‌ షటిల్స్‌లో యంగ్‌ అంతరిక్షానికి వెళ్లారు. నాసాలో 42 ఏళ్లు పనిచేసిన తర్వాత 2004లో యంగ్‌ రిటైరయ్యాడు. జెమిని 3 మిషన్‌లో భాగంగా స్పేస్‌లోకి వెళ్లిన యంగ్‌.. తనతోపాటు నాసా కళ్లుగప్పి కక్ష్యలోకి బీఫ్‌ శాండ్‌విచ్‌ తీసుకెళ్లాడు. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది.   

మరిన్ని వార్తలు