నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది

22 May, 2019 12:37 IST|Sakshi

కంపాలా: ఈ రోజుల్లో ఒక్క బిడ్డని పెంచి పోషించడమే చాలా మందికి చాలా కష్టంగా మారిపోతోంది. అలాంటిది ఉగాండాలో ఓ మహిళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 44 మందికి జన్మనిచ్చింది. ఏ మహిళలైనా నలభై ఏళ్లకే నలభైనాలుగు మంది పిల్లల్ని కనడాన్ని ఎవరూ నమ్మలేకపోవచ్చు. కానీ అసాధ్యమైన అంశాన్ని ఆమె సుసాధ్యం చేసింది. అయితే అది ఆమె ఇష్టంతో చేసిన పనికాదు. ఒకవైపు దయనీయ పరిస్థితి, మరోవైపు తన శరీరంలో జన్యువుల అసాధారణ స్థితి. ఆమెను 44 మంది పిల్లలకు తల్లిని చేశాయి. ఆమె పేరు మరియమ్‌ నబాటాంజీ. నివాసముండేది అత్యంత వెనుకబడిన ఉగాండాలోని ముకనో జిల్లాలో. ఆమెకు 12 ఏళ్లకే వివాహమైంది. గత రెండు దశాబ్దాలలో ఏటా కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. ఇప్పుడు ఆ సంఖ్య 44 మందికి పెరిగింది. దీంతో ఆమె ఆ దేశంలో ఓ సరికొత్త రికార్డును నమోదు చేశారు.

మొట్ట మొదటి సంతానం 12 ఏళ్లకే సంభవించింది. తొలి సంతానమే కవలలు. అతంటితో ఆగకుండా ప్రతి ఏడాది పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఆమెకే ఎందుకిలా జరుగుతుందనే దానిపై దేశంలోని ప్రముఖ వైద్యలంతా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైన కేసుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఆమె ఒవేరియన్‌ పెద్దదిగా ఉండడమే దానికి కారణమని తెలిపారు. బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ వేసుకునే అవకాశం ఉన్నా, అది అంత క్షేమకరం కాదనీ, ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో కుటుంబ నియంత్రణ పాఠించలేదు. సాధారణంగా ఆఫ్రికాలో సరాసరిన ఓ మహిళ ఐదు నుండి ఆరుగురు పిల్లల వరకూ జన్మనిస్తుంటుంది. ప్రపంచ సగటు ఈ విషయంలో 2.4 మాత్రమేననీ గణాంకాలు చెబుతున్నాయి. 

అయితే ఇప్పుడు ఆమె కన్న 44 మంది పిల్లల్లో ఆరుగురు రకరకాల కారణాల వల్ల చనిపోగా, ప్రస్తుతం 38 మంది జీవించి ఉన్నారు. తన జీవితంలో ఇంతమంది పిల్లల్ని కనే విషయంపై ఆమె మాట్లాడుతూ 'నాకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. అప్పటికే నా భర్త వయసు 28 సంవత్సరాలు. చిన్నప్పుడు చాలా పేదరికం అనుభవించాను. మాకు తిండి లేని సమయంలో అన్నంలో గాజుముక్కలు కలిపి తినిపించి పిల్లల్ని చంపేసింది. నేను మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నన్ను బలవంతంగా ఓ వ్యక్తికి కట్టబెట్టారు. ఆయన నన్ను లైంగిక బానిసగా మార్చేశాడు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 18 మంది పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకోవాలని భావించానని, కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల అది వీలుపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తోబుట్టువులను కోల్పోయిన నబతాంజీ తన పిల్లల్లోనే తన తోబుట్టువులను చూసుకోవాలని అనుకుంది. 38 మంది పిల్లలతో కనీస వసతులు సరిగా లేని ఓ ఇంట్లో ధైర్యంగా జీవిస్తోంది. ప్రతీరోజూ 25 కిలోల మైజ్‌ ఫ్లోర్‌ ఆహారంగా ఆ కుటుంబానికి అవసరం. చేపలు, మాంసం చాలా చాలా అరుదుగా మాత్రమే తింటారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. శనివారం అందరూ కలిసి పని చేసుకుంటారట. పిల్లలందర్నీ అలా చూస్తుంటే తాను జీవితంలో పడ్డ కష్టాలన్నింటినీ మర్చిపోతానంటోంది నబతాంజీ. రెండేళ్ల కిందట ఆమెకు కుటుంబ నియంత్రణ చికిత్స చేశారు.

మరిన్ని వార్తలు