చమురుతో నొప్పి వదులుతుంది.. 

14 Apr, 2019 03:35 IST|Sakshi

బాకు : కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా..? ఆ భరించరాని నొప్పి నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి ఎన్నో ప్రకటనలు మీరు చూసుంటారు.. విని ఉంటారు. అయితే వీటన్నింటినీ తలదన్నే.. వీటన్నింటి కన్నా వినూత్నమైన చక్కటి పరిష్కారాన్ని అజర్‌బైజాన్‌ లోని ఓ క్లినిక్‌ కనిపెట్టింది. అదేంటంటే నాఫ్తాలాన్‌ అనే ముడి చమురుతో స్నానం చేస్తే ఆ కీళ్ల నొప్పులన్నీ మటుమాయం అవుతాయని చెబుతున్నారు. చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. ఆ దేశ రాజధాని బాకూకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెహిర్లీ నాఫ్తాలాన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఈ తరహా చికిత్సను అందిస్తున్నారు.  

ఇలా చేస్తారు.. 
బాత్‌టబ్‌లో నిండుగా ముడి చమురును ముందుగా నింపుతారు. అందులో రోగులను 10 నిమిషాల పాటు పడుకోవాలని చెబుతారు. ఆ చమురు ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రత కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. అంతే కొద్ది రోజుల పాటు ఇలా చికిత్స అందిస్తే నొప్పులన్నీ మటుమాయం అవుతాయట. ఆర్థరైటిస్‌ నుంచి చాలా మందికి విముక్తి కలిగిందని డాక్టర్లు చెబుతున్నారు. అక్కడికి వచ్చే రోగులు కూడా తమకు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతోందని, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నట్లు చెబుతున్నారు. దీంతో అజర్‌బైజాన్‌లో ఇప్పుడు ఇది హాట్‌ ట్రెండ్‌గా మారింది. త్వరలోనే మన దగ్గర కూడా ఈ చికిత్స అందుబాటులోకి వస్తుందేమో చూద్దాం.

మరిన్ని వార్తలు