నాసా టాయిలెట్‌ పోటీ.. గెలిస్తే 26.5 లక్షలు

28 Jun, 2020 08:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్ డీసీ : చంద్రుడిపై శాశ్వతంగా తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఆ దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఆర్టెమిస్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2024లొ చంద్రుడిపై శాశ్వత నివాస స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్నదే  ఈ మిషన్‌ లక్ష్య. శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలంటే అందులో టాయిలెట్‌ తప్పనిసరిగా ఉండాలి. భూమిపై ఉపయోగించే టాయిలెట్‌ను అక్క ఉపయోగించలేము. కారణం, గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటమే. దీంతొ టాయిలెట్‌ నిర్మాణం నాసా వినూత్న పోటీని పెట్టింది.  చంద్రునిపై టాయిలెట్ రూపకల్పన చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను సవాలు చేసింది.

మంచి డిజైన్‌ తయారుచేసి ఇచ్చిన వారికి నగదు బహుమతి కూడా ఇవ్వనుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా టాయిలెట్ ను డిజైన్ చేసిన వాళ్లకు  35వేల డాలర్ల(దాదాపు 26.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  ఆసక్తిగల వ్యక్తులు ఆగష్టు 17నాటికి డిజైన్లను పంపించాలని నాసా పేర్కొన్నది. 18 ఏళ్లు దాటిన వారు జట్టుగా లేదా వ్యక్తిగా ఈ డిజైన్‌ చేయవచ్చు. 12 ఏళ్ల లోపు ఉన్న పిల‍్లలు ఈ పోటీలో పాల్గొనాలంటే వారి డిజైన్లలను సమర్పించడానికి  తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేర్లు నమోదు చేసుకోవాలి. (జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం)

భూమిపై మాదిరిగా గురుత్వాకర్షణ శక్తి చంద్రునిపై లేదు. అందువలన ప్రతిదీ అంతరిక్షంలో తిరుగుతుంది. అందుకే ఈ పని నాసాకు సవాలుగా మిగిలిపోయింది.  అందుకే ఈ పోటీని పెట్టింది. భారీ నగదు బహుమతి ఉండడంతో కచ్చితంగా వేలకొద్ది డిజైన్లు నాసా దగ్గరకు వస్తాయి. అంతరిక్షంపై అవగాహన ఉండే వాళ్లకు ఇదో సువర్ణావకాశం. నాసా కోసం టాయిలెట్‌ డిజైన్‌ చేసి లక్షల్లో బహుమతి పొందొచ్చు.

మరిన్ని వార్తలు