భూమి బరువు తగ్గుతోంది..

3 Dec, 2018 05:22 IST|Sakshi

అధ్యయనానికి నాసా సన్నాహాలు

వాషింగ్టన్‌: భూమి రోజురోజుకూ తనపై ఉన్న వాయువులను కోల్పోతున్న అంశంపై అధ్యయనం చేసేందుకు నాసా సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది. విజన్స్‌(విజువలైజింగ్‌ అయాన్‌ ఔట్‌ఫ్లో వయా న్యూట్రల్‌ ఆటమ్‌ సెన్సింగ్‌)–2 అనే రాకెట్‌ను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. నార్వే నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని ద్వారా భూమి  తన వాతావరణంలోని ఆక్సిజన్‌ను అంతరిక్షంలోకి కోల్పోతున్న అంశాన్ని అధ్యయనం చేయనుంది. ‘భూమి రోజూ బరువును కోల్పోతుంది.

వంద నుంచి కొన్ని వందల టన్నుల మేర వాతావరణంలోని వాయువులను భూమి అంతరిక్షంలోకి కోల్పోతున్నట్లు రుజువయింది. ఇదే వేగంతో భూమి తన వాయువులను తిరిగి నింపుకోవటానికి బిలియన్‌ లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు పడుతంది’అని నాసా  శాస్త్రవేత్త థామస్‌ మూరే వెల్లడించారు. హైడ్రోజన్‌ కంటే 16 రెట్లు బరువైన ఆక్సిజన్‌ భూ గురుత్వాకర్షణ వలయాన్ని తప్పించుకుని వెళ్లలేదని శాస్త్రవేత్తలు భావించేవాళ్లు. అయితే ప్రస్తుతం భూమి చుట్టుపక్కల ఉన్న అంతరిక్ష ఆవరణం ఎక్కువ శాతం భూమి మీద ఉద్భవించిన వాయువులతోనే నిండి ఉండటం కలవరపరిచే అంశం.  

సౌండింగ్‌ రాకెట్‌ అంటే..
సౌండింగ్‌ రాకెట్‌ అంటే నాటికల్‌ అర్థం ప్రకారం కొలతలు తీసుకునేది. ఈ రాకెట్‌ రాకెట్‌ నింగిలోకి ఎగిసిన తర్వాత మొదటి మోటార్‌ భాగంలోని ఇంధనంతో పైకి వెళ్తుంది. అనంతరం పేలోడ్‌ను వదిలేసి రాకెట్‌ భూమి మీదకి వచ్చేస్తుంది. పేలోడ్‌ మాత్రం అంతరిక్షంలోకి వెళ్తూ అధ్యయనాన్ని పూర్తి చేస్తుంది. గ్రాండ్‌ చాలెంజ్‌లో భాగంగా రానున్న 14 నెలల్లో పంపనున్న 9 సౌండింగ్‌ రాకెట్లలో మొదటి రాకెట్‌ విజన్స్‌–2 కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు