కుల్‌సుమ్‌ ఒక్కసారి కళ్లు తెరిచి చూడు..

12 Sep, 2018 11:28 IST|Sakshi
సతీమణి కుల్‌సుమ్‌తో నవాజ్‌ షరీఫ్‌

సతీమణితో పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చివరి మాటలు

అంత్యక్రియల్లో పాల్గొనెందుకు 12 గంటల పెరోల్‌

లాహోర్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సతీమణి కుల్‌సుమ్‌ నవాజ్‌ (68) కన్నుమూసిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నవాజ్‌ షరీఫ్‌ తన సతీమణితో గడిపిన చివరి క్షణాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎంత దేశ ప్రధాని అయినా ఒకరికే భర్తేకదా.. నవాజ్‌ షరీఫ్‌ భావోద్వేగంతో కూడుకున్న ఈ వీడియోలో తన భార్య కోసం ‘కుల్‌సుమ్‌ ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడు.. ఆ అల్లా నీకు శక్తిని  ప్రసాదించాలి’ అంటూ ఉర్దూలో ఆయన మాట్లాడిన  చివరి మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో అక్రమ ఆస్తుల కేసులో ఆయనపై 11 ఏళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో లండన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో నవాజ్‌ షరీఫ్‌ తన సతీమణితో చివరిసారిగా మాట్లాడారు. 

లభించిన పెరోల్‌..
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నవాజ్‌కు 12 గంటల పెరోల్ లభించింది. అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న నవాజ్‌ భార్య మరణం విషయం తెలిసి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు అనుమతినిచ్చింది. రావల్పిండిలోని అదియాల జైలులో నవాజ్‌తో పాటు శిక్షను అనుభవిస్తున్న ఆయన కుమార్తె మర్యం నవాజ్‌, అల్లుడ సప్ధర్‌లకు కూడా పెరోల్‌ లభించింది. అక్కడి నుంచి వీరిని అంత్యక్రియల జరిగే జతి ఉమ్రాకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.  కుల్‌సుమ్‌ మరణవార్తతో పాకిస్తాన్‌లోని నవాజ్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతదేహాన్ని సైతం లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు