మోదీ ఇచ్చిన తలపాగాలో మెరిసిన పాక్ ప్రధాని

28 Dec, 2015 10:49 IST|Sakshi
మోదీ ఇచ్చిన తలపాగాలో మెరిసిన పాక్ ప్రధాని

లాహోర్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఓ తలపాగా ధరించి.. తన మనవరాలి పెళ్లి విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చిన గులాబీ రంగు రాజస్థానీ తలపాగా ధరించిన షరీఫ్.. పెళ్లి మంటపంలో కనువిందు చేశారు. మోదీ స్వయంగా అందించిన తలపాగాను ధరించడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలనే పాక్ ఆకాంక్షకు నిదర్శనమని పాక్ అధికార ప్రతినిధి తెలిపారు. ఆయనిచ్చిన కానుకను గౌరవించి, శాంతి సామరస్యాల స్థాపనలో తమ దేశ నిబద్ధతను, నిజాయితీని ప్రకటించారని పేర్కొన్నారు. శుక్రవారం తన పర్యటన సందర్భంగా మోదీ, పాక్ ప్రధానికి తలపాగా బహుమతిగా అందించారన్నారు.

శనివారం జరిగిన ఈ వివాహ విందుకు షరీఫ్ కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు, విదేశీ ప్రముఖులు తదితర వీవీఐపీ అతిథులు దాదాపు రెండు వేల మంది విచ్చేసి  వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రధాని మోదీ లాహార్  ఆకస్మిక పర్యటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు