భూ..కోపం!

13 May, 2015 02:50 IST|Sakshi
భూ..కోపం!

* నేపాల్‌లో మళ్లీ భారీ భూకంపం
* 50 మంది మృతి, 1,100 మందికి గాయాలు
* రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదు
* మూడు వారాల్లోనే రెండోసారి విలయం

 
భూవిలయంతో కకావికలమైన నేపాల్‌ను 3 వారాలు తిరగకముందే మరో భారీ భూకంపం తాకింది. నాటి పెను భూకంపం 8,000 మందికి పైగా బలితీసుకోగా.. ఆ మహా విషాదం, అది సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోలేకపోతున్న ఈ హిమాలయ దేశంలో మంగళవారం మళ్లీ భారీ భూ కంపం సంభవించి మరో 50 మంది ప్రాణాలను బలిగొంది. మరో 1,117 మంది గాయాలపాలయ్యారు. రాజధాని కఠ్మాండు నగరానికి తూర్పుగా 83 కిలోమీటర్ల దూరంలో ఎవరెస్ట్ పర్వతం సమీపంలో భూమికి కేవలం 15 కిలోమీటర్ల తక్కువ లోతులో వచ్చిన తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3 గా నమోదైంది.
 
 కఠ్మాండు: భూ విలయంతో కకావికలమైన నేపాల్‌ను మూడు వారాలు తిరగకముందే మరో భారీ భూకంపం తాకింది. నాటి పెను భూకంపం 8,000 మందిని పైగా బలితీసుకోగా.. ఆ మహావిషాదం, అది సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోలేకపోతున్న ఈ హిమాలయ దేశంలో మంగళవారం మళ్లీ భారీ భూకంపం సంభవించి మరో 50 మంది ప్రాణాలను బలిగొంది. మరో 1,117 మంది గాయాలపాలయ్యారు. కఠ్మాండు నగరానికి తూర్పుగా 83 కిలోమీటరల దూరంలో ఎవరెస్ట్ పర్వతం సమీపంలో భూమికి కేవలం 15 కి.మీటర్ల తక్కువ లోతులో వచ్చిన తాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3 గా నమోదయింది. మధ్యాహ్నం 12.35 గంటలకు సంభవించిన ఈ భూకంపం.. గత భూకంపానికి తీవ్రంగా దెబ్బతిన్న దోలఖా, సింధుపాల్‌చౌక్ జిల్లాలను మళ్లీ దెబ్బతీసింది. మరిన్ని భవనాలు కుప్పకూలాయి.
కొండచరియలు విరిగిపడ్డాయి.

గత భూకంపం తరహాలోనే తాజా భూకంపం కూడా భారత్‌పైనా ప్రభావం చూపింది. బిహార్‌లో 15 మంది చనిపోయారు. చైనా పరిధిలోని టిబెట్‌లో భూకంపం వల్ల ఒక మహిళ చనిపోయారు. గత నెల 25న రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం నేపాల్‌ను అతలాకుతలం చేసి గ్రామాలను మట్టిదిబ్బలుగా మార్చడం తెలిసిందే. తర్వాతి భారీ భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆరుబయటే నివసిస్తున్నారు. మంగళవారం సంభవించిన భారీ భూకంపం వారిని హతాశులను చేసింది. ఆ తర్వాత కూడా రిక్టర్ స్కేలుపై 5 కన్నా ఎక్కువ తీవ్రతతో 6 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. కాళ్ల కింద నేల కదిలిపోతోంటే ప్రాణాలు దక్కించుకునేందుకు తలో దిక్కుకు పరుగులు తీశారు. నాటి భూకంపంలో నేలమట్టమైన కఠ్మాండు మరోసారి వణికిపోయింది. ఇళ్లలో ఉన్న ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.  
 
 భూ ప్రకంపనలు కొనసాగుతుండటంతో ప్రజలు ఆరుబయటే కాలం గడుపుతున్నారు.  అందుబాటులో ఉన్న హెలికాప్టర్లన్నిటినీ, వైద్య బృందాలను భూకంప  ప్రాంతాలకు పంపిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. త్రిభువన్‌దాస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. కఠ్మాండు రావలసిన విమానాలు కొన్నిటిని దారి మళ్లించారు. మరోవైపు.. నేపాల్‌లోనే సహాయ చర్యల కోసం ఉంచిన భారత వైమానికి దళానికి చెందిన 8హెలికాప్టర్లను కూడా సహాయ చర్యలకు వినియోగించనున్నారు. భూకంపం సంభవించిన వెంటనే.. వీటిలో ఒక హెలికాప్టర్ ద్వారా ప్రభావిత ప్రాంతాలను గగనతలం నుంచి పరిశీలించారు. భారత సైన్యం సహాయ చర్యల్లో నేపాల్ సైన్యంతో కలిసి పనిచేస్తోందని అధికారిక ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ సాయంతో 27 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించింది. 

మరిన్ని వార్తలు