భారత్‌ వ్యతిరేక ఎన్జీవోల కట్టడికి నేపాల్‌ నిర్ణయం

13 Jan, 2020 05:30 IST|Sakshi

కఠ్మాండు: భారత్, చైనాలతో సంబంధాలను దెబ్బతీసే కార్యకలాపాలను సాగించే ప్రభుత్వేతర సంస్థ(ఎన్జీవో)లను కట్టడి చేసేందుకు నేపాల్‌ నడుం బిగించింది. ఇటువంటి సంస్థల కారణంగానే సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని భారత్‌...సరిహద్దుల గుండా టిబెటన్ల కదలికలు ఎక్కువైనట్లు చైనా... నేపాల్‌కు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైన రెండు దేశాలతో సంబంధాలు సవ్యంగా సాగేందుకు ఎన్జీవోల రిజిస్ట్రేషన్‌ నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు సోషల్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ తెలిపిందని ‘కఠ్మాండు పోస్ట్‌’ తెలిపింది. ముఖ్యంగా సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మదరసాలు, ప్రార్థనా మందిరాలకు ఖతర్, సౌదీ అరేబియా, టర్కీల నుంచి నిధులు అందుతున్నట్లు భారత్‌ తెలిపిందని పేర్కొంది. అందుకే వీటికి అందే నిధులు, చేపట్టే కార్యక్రమాలపై పర్యవేక్షణ జరిపేందుకు వీలు గా కొత్త చట్టాన్ని తేనున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లోని మదరసాల్లో ఉగ్రవాద కార్యక లాపాలు అంతర్గత భద్రతకు ప్రమాదమంటూ గతంలో నేపాల్‌కు భారత్‌ హెచ్చరికలు చేసిందని కూడా కౌన్సిల్‌ వివరించింది.

మరిన్ని వార్తలు