‘భారత్‌ నుంచి వచ్చే వైరస్‌ వాటి కంటే ప్రాణాంతకం’

20 May, 2020 14:47 IST|Sakshi

ఖాట్మండూ: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య వివాదం నెలకొన్న తరుణంలో నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ప్రబలుతోందని ఆరోపించారు. భారత్‌ నుంచి వచ్చే వైరస్‌ చైనీస్‌, ఇటాలియన్‌ వైరస్‌ కంటే మరింత ప్రాణాంతకమైనదని షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌లో ప్రసంగించిన కేపీ శర్మ.. ‘‘భారత్‌ నుంచి అక్రమ మార్గాల ద్వారా ఇక్కడి వచ్చిన వారు దేశంలో వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కొంతమంది రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి పరీక్షలు నిర్వహించకుండానే వారిని లోపలికి తీసుకువస్తున్నారు. 

ఇలా బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు ఉన్న నేపథ్యంలో కోవిడ్‌-19ను కట్టడి చేయడం కష్టంతో కూడుకున్న పని. చైనా, ఇటలీ వైరస్‌ కంటే ఇండియా వైరస్‌ మరింత ప్రాణాంతకంగా పరిణమించింది. దాని కారణంగా ఎంతో మంది ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు’’అని భారత్‌పై అసహనం వ్యక్తం చేశారు. కాగా ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌ కనుమతో కలుపుతూ భారత్‌ రోడ్డు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్‌.. ఇందుకు నిరసనగా తమ దేశంలోని భారత రాయబారికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.(కాలాపానీ మాదే.. భారత్‌ నుంచి తీసుకుంటాం)

ఈ క్రమంలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్‌ చేస్తూ ఆ దేశ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల విషయంలో గత పాలకుల మాదిరి తాము వెనుకంజ వేయబోమని, వాటిని దక్కించుకుని తీరతామని ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా తమ దేశంలో కరోనా వ్యాప్తికి భారత్‌ కారణమంటూ మరోసారి వివాదానికి తెరతీశారు.(భారత్‌పై నేపాల్‌‌ అభ్యంతరం.. చైనా ప్రమేయం!)

భారత్‌పై నేపాల్‌‌ అభ్యంతరం.. చైనా ప్రమేయం!

మరిన్ని వార్తలు