నేపాల్‌లో కీలక పరిణామం

21 Feb, 2018 09:48 IST|Sakshi
కేపీ శర్మ ఓలీ, ప్రచండ (ఫైల్‌)

కమ్యూనిస్ట్‌ పార్టీల విలీనం

కఠ్మాండు: నేపాల్‌లో రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎన్‌–యూఎంఎల్, సీపీఎన్‌–మావోయిస్టు సెంటర్‌ చారిత్రక విలీన ఒప్పందానికి అంగీకారం తెలిపాయి. దీంతో నేపాల్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బాటలు పడినట్లయింది. నేపాల్‌ సార్వత్రిక, ప్రావిన్షియల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈ కూటమి ఏకం కానుందని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ఒప్పందం కుదిరింది.

ఈ రెండు పార్టీలు విలీనం కావడంతో నేపాల్‌లో రాజకీయ స్థిరత్వానికి అవకాశం లభిస్తుందని, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్‌–యూఎంఎల్, మాజీ ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌–మావోయిస్టు సెంటర్‌ కలసి డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. 275 మంది సభ్యుల పార్లమెంట్‌లో ఈ కూటమి 174 స్థానాలను దక్కించుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది.  

మరిన్ని వార్తలు