‘దెబ్బకు దెబ్బ.. నీ పిల్లల్నీ చంపేస్తా..!’

1 Jul, 2018 19:14 IST|Sakshi
యూఎస్‌ ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ చీఫ్‌ అజిత్‌పాయ్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూయార్క్‌: నెట్‌ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేయడంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, యూఎస్‌ ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ చీఫ్‌పై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘నీ కుటుంబాన్ని అంతం‍ చేస్తాన’ని నిందితుడు ఎఫ్‌సీసీ చీఫ్‌ అజిత్‌పాయ్‌ను బెదిరించాడు. ఇంటర్‌నెట్‌ సేవల ధరలు పెరుగుతాయనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనీ, దానికి బాధ్యుడు అజిత్‌ పాయ్‌ అని ఆరోపించాడు. అందుకనే ప్రతికారంగా అజిత్‌ పిల్లలను అంతమొందిస్తానని ఈ మెయిల్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంపై వైట్‌హౌస్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.

నేపథ్యం: ఇప్పటి వరకు ఇంటర్‌నెట్‌ సేవలపై తటస్థంగా (నెట్‌ న్యూట్రాలిటీ) వ్యహరించిన ఎఫ్‌సీసీ ఆ విధానానికి జూన్‌లో స్వస్తి పలికింది. ఎఫ్‌సీసీ ప్రతిపాదన మేరకు నెట్‌ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేస్తూ అమెరికా కాంగ్రెస్‌ తీర్మానం చేసింది. అయితే, నెట్‌ న్యూట్రాలిటీని రద్దు చేయడంతో అమెరికా వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవల ధరలు పెరుగుతాయనీ, ఇది వినియోగదారులపై ఆర్థిక భారం మోపనుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో వెబ్‌సైట్ల మనుగడను ప్రశ్నార్థకం చేసే నెట్‌ న్యూట్రాలిటీ రద్దుపై ప్రతిపక్ష డెమొక్రటిక్‌ సభ్యులు ప్రజల్ని రెచ్చగొడుతూ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే కాలిఫోర్నియాకు చెందిన మర్కాన్‌ మన్‌ మాత్రం.. కేవలం ఎఫ్‌సీసీ చీఫ్‌ అజిత్‌ పాయ్‌ వల్లనే నెట్‌ న్యూట్రాలిటీ విధానం రద్దయిందనీ, అందుకే అతనిపై పగ తీర్చుకుంటానని హెచ్చరించాడు.

మరిన్ని వార్తలు