త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం 

2 Jan, 2020 03:07 IST|Sakshi

ప్రపంచానికి చూపుతానన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ 

సియోల్‌: త్వరలో ఒక నూతన వ్యూహాత్మక ఆయుధాన్ని ప్రపంచానికి చూపనున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వెల్లడించారు. అణ్వాయుధ, ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించకూడదంటూ విధించుకున్న స్వీయ నియంత్రణను మరెంతో కాలం కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఉత్తర కొరియా తీసుకున్న ఈ స్వీయ నియంత్రణ నిర్ణయాన్ని తన దౌత్య విజయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అణ్వాయుధాలు, బాలిస్టిక్‌ క్షిపణుల పరీక్షలపై నియంత్రణ విధించుకున్న సమయంలో.. కిమ్‌ తన మధ్యశ్రేణి ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకున్నారు. సాధారణంగా ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌(ఐసీబీఎం) వంటి అణ్వాయుధ సామర్థ్య ఆయుధ శ్రేణిని వ్యూహాత్మక ఆయుధంగా పరిగణిస్తారు.

కిమ్‌ వ్యాఖ్యలను బుధవారం అధికార మీడియా ప్రచురించింది. అధికార వర్కర్స్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ కీలక సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కిమ్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, అదే సమావేశంలో.. ఆర్థిక ప్రయోజనాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టబోనని కిమ్‌ స్పష్టం చేశారు. అణ్వాయుధ నిర్మూలన, ఉత్తర కొరియాపై ఆంక్షల తొలగింపు తదితర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరని కారణంగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో, రష్యా, చైనాలతో మైత్రికి కిమ్‌ పలు చర్యలు చేపట్టారు. 

నూతన సంవత్సర ప్రసంగానికి డుమ్మా 
2013 నుంచీ ప్రతీ సంవత్సరం తొలి రోజున ఆనవాయితీగా ఇచ్చే ప్రసంగానికి ఈ  సంవత్సరం కిమ్‌ డుమ్మా కొట్టారు. గతాన్ని సమీక్షిస్తూ, భవిష్యత్తు లక్ష్యాలను వివరిస్తూ దేశాధ్యక్షుడిగా ప్రజలకు ప్రతీ సంవత్సరం జనవరి 1న కిమ్‌ సందేశమిస్తారు.

ఆ ప్రసంగం పూర్తి పాఠం అధికార మీడియాలో ప్రచురితమవుతుంది. కానీ ఈ సంవత్సరం ఆయన ఎలాంటి సందేశమివ్వలేదు. కానీ, పార్టీ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగాన్ని అధికార టీవీ ప్రసారం చేసింది. అమెరికాతో చర్చలు సహా గత సంవత్సర వైఫల్యాలను అంగీకరించలేకనే 2020 తొలి రోజు సందేశాన్ని కిమ్‌ ఇవ్వలేదని దక్షిణ కొరియాకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు పార్క్‌ వాన్‌గాన్‌ వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు