న్యూయార్క్‌ గవర్నర్‌ సోదరుడికి ‘కరోనా’

2 Apr, 2020 17:04 IST|Sakshi

న్యూయార్క్‌: తన తమ్ముడు, సీఎన్‌ఎన్‌ టీవీ న్యూస్‌ యాంకర్‌ క్రిస్‌ క్యూమో మహమ్మారి కరోనా వైరస్‌ బారిన పడ్డాడని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తెలిపారు. ప్రాణాంతక వైరస్‌ ఎవరికైనా సోకుతుంది.. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘‘నా చిట్టి తమ్ముడిని రక్షించుకోలేకపోతున్నా. తనను తాను కూడా కాపాడుకోలేడు. ఇది చాలా భయంకరంగా ఉంది. తన పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మనం ప్రేమించే వాళ్లకు ఇలా జరిగితే అందరం ఇలాగే విచారిస్తాం కదా. తమ్ముడు ఐ లవ్‌ యూ. ధైర్యంగా ఉండు’’ అని ఆండ్రూ ఉద్వేగభరిత ట్వీట్‌ చేశారు.

కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంటువ్యాధి కారణంగా బుధవారం ఒక్కరోజే 884 మంది మృతిచెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి దెబ్బకు ఇప్పటికే వెయ్యికి పైగా న్యూయార్క్‌ పౌరులను కోల్పోయామని గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌ పరిస్థితి బాగా లేదని.. వైద్య సిబ్బంది స్వచ్చందంగా ముందుకు వచ్చి తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో దాదాపు 80 వేల మంది రిటైర్డు డాక్టర్లు, నర్సులు ఆపత్కాలంలో మద్దతుగా నిలిచేందుకు ముందకు వచ్చారు. (కరోనాతో 93 వేల మంది ప్రాణాలకు ముప్పు)

మరిన్ని వార్తలు