న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం

22 Mar, 2019 03:51 IST|Sakshi
న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌

క్రైస్ట్‌చర్చ్‌ ఘటన నేపథ్యంలో నిర్ణయం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ సిటీలో ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో ఇకపై దాడిలో వాడే తుపాకులపై ఆ దేశం గురువారం తక్షణ నిషేధం విధించింది.  తుపాకులు, సైన్యం వాడే గన్‌ల మాదిరి ఉండే సెమీ–ఆటోమేటిక్‌ తుపాకులను అన్నింటినీ తక్షణం నిషేధిస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ తెలిపారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదులపై ఓ శ్వేతజాతీయుడు గత శుక్రవారం కాల్పులు జరిపి 50 మంది చంపేయడం తెల్సిందే.

‘శుక్రవారం నాటి దాడి కోసం ఉగ్రవాది వాడిన రకం తుపాకులపై నిషేధం విధిస్తున్నాం. వాటిని కొనాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. గతంలో కొన్నవాటికి వెనక్కిఇస్తే డబ్బు చెల్లిస్తాం’ అని ప్రధాని చెప్పారు. ఇక అమెరికాలో తుపాకులపై నిషేధం విధించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉండటం తెలిసిందే. న్యూజిలాండ్‌ నిర్ణయంతో తాజాగా అమెరికాలో ఆ డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. పలువురు అమెరికా రాజకీయ నేతలు సహా తుపాకుల విచ్చలవిడి వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా అమెరికా కూడా తుపాకులపై నిషేధం విధించాలని కోరుతున్నారు.

బతికున్న వ్యక్తిని చనిపోయాడన్నారు..
బతికున్న ఓ వ్యక్తి పేరును క్రైస్ట్‌చర్చ్‌ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి జాబితాలో పోలీసులు పొరపాటున చేర్చారు. కాల్పులు జరిపిన బ్రెంటన్‌ టారంట్‌పై పోలీసులు తయారుచేసిన అభియోగప త్రంలో బతికున్న ఓ వ్యక్తి పేరును చేర్చి పోలీసులు దానిని కోర్టుకు  సమర్పించారు. ఆ వ్యక్తితో మాట్లాడి క్షమాపణ కోరామనీ, అభియోగపత్రంలో అతని పేరును తొలగించామని పోలీసులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు