తల్లి నుంచి బిడ్డకు ‘కోవిడ్‌’ రాదు

17 Mar, 2020 09:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌: కరోనా వైరస్‌ తల్లుల నుంచి బిడ్డలకు సోకదని చైనాలో జరిగిన అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. హౌఝాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ తాజా సంచికలో ప్రచురితమైంది. వైరస్‌కు కేంద్ర బిందువైన హుబేలోని వూహాన్‌లో నలుగురు గర్భిణులపై ఈ అధ్యయనం జరిగింది. వీరందరూ కోవిడ్‌ బారిన పడినప్పుడే పిల్లలకు జన్మనిచ్చారు. నవజాత శిశువులను ఐసీయూలో ఉంచి సాధారణ ఆహారం అందించినప్పటికీ ఎవరిలోనూ జ్వరం, దగ్గు లాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని తెలిపారు. పుట్టిన నలుగురిలో ముగ్గురిలో శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు లేవని స్పష్టం కాగా, నాలుగో బిడ్డపై పరీక్షలు చేసేందుకు తల్లి నిరాకరించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక పసిబిడ్డ మూడు రోజులపాటు కొద్దిపాటి శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొందని తెలిపారు. (చదవండి: ‘కోవిడ్‌’ దిగ్బంధనం)

కరోనా వ్యాక్సిన్‌ పరీక్షలు ప్రారంభం
వాషింగ్టన్‌: ప్రాణాంతక కోవిడ్‌కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఓ టీకాను అమెరికా పరీక్షిస్తోంది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆర్థిక సాయంతో ఒక మహిళా వాలంటీర్‌కు ప్రయోగాత్మక టీకా వేశారు. అన్నీ సవ్యంగా సాగి ఈ పరీక్షలు విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని అధికారులు చెప్పారు. సియాటెల్‌లోని కైసర్‌ పెర్మనెంటే వాషింగ్టన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఎన్‌ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలు ఇస్తాయి. తీవ్రమైన దుష్ప్రభావాలేవీ లేనట్టు నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నామని, ఇందులో వైరస్‌ ఏదీ లేని కారణంగా టీకా తీసుకున్న వ్యక్తికి కోవిడ్‌ సోకే అవకాశమూ లేదని వివరించారు. (కరోనా వైరస్‌కు రెండు మందులు)

మరిన్ని వార్తలు