తీరం తెలియని ప్రయాణంలా హనీమూన్‌

25 May, 2020 11:08 IST|Sakshi
ఖలెద్‌ మోక్తర్‌, పెరి అబోజెడ్‌

మాలీ : హనీమూన్‌ కోసం మెక్సికో వెళ్లిన ఆ జంట లాక్‌డౌన్‌ కారణంగా మాల్దీవులలో చిక్కుకుపోయింది. తీరం తెలియని ప్రయాణంలా వారి హనీమూన్‌ సాగుతోంది. దేశదేశాలు తిరిగి కష్టాలతో ఎదురీదుతోంది హనీమూన్‌ వెళ్లిన ఆ నవ దంపతుల జంట. వివరాల్లోకి వెళితే.. ఈజిప్టుకు చెందిన ఖలెద్‌ మోక్తర్‌, పెరి అబోజెడ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్‌లో నివాసముంటున్నారు. గత మార్చి 6న స్వదేశంలోని కైరోలో వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ ‌కోసం మెక్సికోకు వెళ్లారు. ఆ తర్వాత మార్చి 19న టర్కీకి తిరుగు ప్రయాణమయ్యారు. టర్కీనుంచి దుబాయ్‌కి కనెక్షన్‌ ఫ్లైట్‌ ఉండటంతో విమానం ఎక్కారు. అయితే విమానం గాల్లో ఉండగానే పెరి మిత్రులు ఆమెకో షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా యూఏఈ విమానాల రాకపోకలను నిలిపివేసిందని వివరించారు. వారు టర్కీలో లాండ్‌ అవ్వగానే అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు కూడా దుబాయ్‌ వెళ్లే విమానాలు రద్దయ్యాయని వెల్లడించారు. దీంతో తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఎక్కడ గడపాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో ఉండటం సాధ్యపడదని వారు భావించారు. ఈ నేపథ్యంలో వారికి ఈజిప్టు వాసులకు వీసా అవసరం లేని మాల్దీవులు గుర్తుకువచ్చాయి. వెంటనే అక్కడికి వెళ్లిపోయారు. ( నవ దంపతులకు హనీమూన్‌ కష్టాలు )

మాల్దీవుల్లోనూ తప్పని కష్టాలు
ఖలెద్‌ మోక్తర్‌, పెరి అబోజెడ్‌ల జంట మార్చి 27న మాల్దీవులకు చేరుకుంది. అయితే అదే సమయంలో అక్కడ కూడా విమానాల రాకపోకలు, రిసార్టు సేవలు రద్దయ్యాయి. దీంతో దాదాపు 70 మంది ఉంటున్న ఐసోలేషన్‌ సెంటర్‌లో కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగాలను కాపాడుకోవటానికి సెల్‌ఫోన్లలో పనులు చేసుకుంటున్నారు. ( మాల్దీవులు చేరుకున్న నౌక.. 1000 మంది..)

దీనిపై వారు మాట్లాడుతూ.. ‘‘ ఐసోలేషన్‌ సెంటర్‌ వాళ్లు మాకు సరైన సదుపాయాలు కల్పించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. సాయంత్రాలు పాటలు పాడతారు, ప్రతిరోజూ డీజే ఉంటుంది. ఒక్కోసారి ఎవ్వరూ డ్యాన్స్‌ చేయకపోవటంతో చాలా బాధగా ఉంటుంది. లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. మా జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. బాగా ఒత్తిడికి గురవుతున్నాము. న్యూస్‌ చదవగానే ఏదో నమ్మకం సరిహద్దులు తెరుస్తారని, కానీ, ప్రతిరోజూ కొత్తగా ఉంటోంది. సరైన వ్యక్తితో ఇలా చిక్కుకు పోవటంలోనూ ఓ ఆనందం ఉంది. ఇదొక్కటే మాకు సంతోషాన్నిచ్చే విషయం ’’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు