లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును 13వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి లండన్ చెక్కేసిన ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలతో వారు నీరవ్ను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో నీరవ్ మోదీని తమకు అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ బ్రిటన్ను కోరిన సంగతి తెలిసిందే. భారత్ వినతిపై స్పందించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు రెండు రోజుల క్రితం నీరవ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అధికారులు మరికాసేపట్లో నీరవ్ని వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు చేశాయి. ఈ నేరాల కింద నీరవ్, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. పారిపోయిన నీరవ్ లండన్లోని ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఇటీవల అక్కడి మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే.