కుక్క ఉంది.. బెయిల్‌ ఇవ్వండి!

31 Mar, 2019 05:13 IST|Sakshi

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్స్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించినపుడు చిత్రమైన ఘటన జరిగింది.∙ఈ సందర్భంగా నీరవ్‌ బెయిల్‌ పొందేందుకు వీలుగా ఆయన లాయర్ల బృందం కొత్తతరహా వాదనను కోర్టుముందుకు తీసుకొచ్చింది. నీరవ్‌ పెంపుడు కుక్కను కారణంగా చూపుతూ బెయిల్‌ ఇవ్వాలని కోరింది. నీరవ్‌ తరఫున క్లేర్‌ మాంట్‌గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్‌ మోదీ కుమారుడు ఇక్కడే చార్టర్‌హౌస్‌ ప్రాంతంలో పాఠశాల చదువు పూర్తిచేశారు.

ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. దీంతో ఒంటరితనంతో ఉన్న నీరవ్‌ ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు దేశాన్ని వదిలిపోయే వ్యక్తులెవరైనా ఈ పని చేస్తారా? బ్రిటన్‌ ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులకు పేరుగాంచింది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు వచ్చాక మరో దేశపు పౌరసత్వం కోసం నీరవ్‌ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఒకవేళ బెయిల్‌ మంజూరుచేస్తే నీరవ్‌ పాస్‌పోర్టును స్వాధీనం చేయడంతో పాటు హాంకాంగ్, సింగపూర్, యూఏఈలో ఉన్న నివాస అనుమతి పత్రాలను సరెండర్‌ చేస్తారని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం నీరవ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

మరిన్ని వార్తలు