కిమ్‌ తరపున ప్రత్యేక దూతలు

11 Jan, 2018 11:33 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్ : దక్షిణ కొరియాలో జరగబోయే వింటర్‌ ఒలంపిక్స్‌ ఈసారి హాట్‌ హాట్‌గా సాగనున్నాయి. దశాబ్దాల తర్వాత ఉత్తర కొరియా ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. పొరుగు దేశంతో శాంతి చర్చలకు తెరలేపిన నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరితోపాటు ఛీర్‌లీడర్స్‌ను కూడా పంపేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. 

ఆర్మీ ఆఫ్‌ బ్యూటీ పేరుతో 18-20 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిలను(300 మంది) అధికారులు ఎంపిక చేశారు. ఈ బృందానికి కిమ్‌ సతీమణి రి సోల్‌-జూ ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘‘ఉత్తర కొరియా అంటే ప్రపంచం దృష్టిలో కరుడుగట్టిన దేశంగా అభిప్రాయం ఉంది. కానీ, ఇక్కడ అందగత్తెలకు లోటు లేదు. అది నిరూపించేందుకే ఈ ప్రయత్నం’’ అని రి సోల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 2005 ఇన్‌చియాన్‌ ఏషియన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఆమె ఛీర్‌ గాళ్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు.

కాగా, 2002 బుసన్‌ ఏషియన్‌ గేమ్స్‌ లో ఉత్తర కొరియా తరపున ఛీర్‌ లీడర్స్‌ సందడి చేశారు. కొరియన్‌ వార్‌ తర్వాత 1953 నుంచి ఇరు దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ఈ నెల 9న ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగ్గా.. వింటర్‌ ఒలంపిక్స్‌ లో పాల్గొనేందుకు ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ​కొరియా దేశాల మధ్య మైత్రి నెలకొనేందుకు వింటర్ ఒలంపిక్స్‌ 'మంచి అవకాశం'గా ఉపయోగపడుతుందని ఇరు దేశాల ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు