ఉత్తర కొరియా కీలక నిర్ణయం

9 Jun, 2020 08:27 IST|Sakshi

దక్షిణ కొరియాతో తెగదెంపులు

ప్యాంగ్‌యాంగ్‌: దక్షిణ కొరియాతో సైనిక, రాజకీయ పరమైన అన్ని సంబంధాలను తెంచుకుంటామని ఉత్తర కొరియా మంగళవారం వెల్లడించింది. తమ శత్రుదేశంతో ఇక ఎంతమాత్రం సంబంధాలు నెరపబోమని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇరు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియా సరిహద్దుల్లో కరపత్రాలు పంచుతున్న కార్యకర్తలపై బెదిరింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాయాది దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన సమసిపోలేదు. 

ఈక్రమంలో దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు.. కిమ్‌ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. దాంతోపాటు కిమ్‌ను దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. దీంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని వారం క్రితమే హెచ్చరించింది. అంతేకాకుండా ఉభయ కొరియాల పునర్‌ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని చెప్పింది.
(చదవండి: కిమ్‌ సోదరి హెచ్చరిక.. తలొగ్గిన దక్షిణ కొరియా!)

మరిన్ని వార్తలు