ఉ.కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

22 Mar, 2020 06:24 IST|Sakshi

సియోల్‌: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఒకవైపు తల్లడిల్లుతుండగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొన్‌ ఉంగ్‌ తన పంథాలోనే వెళ్తున్నారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టారు. కిమ్‌ శుక్రవారం ఉదయం సోంచన్‌ కౌంటీలోని ఓ ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను అధికార మీడియా విడుదల చేసింది. 700 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్‌ సమావేశం ఏప్రిల్‌ 10న ఉంటుందని ఈ క్షిపణి ప్రయోగానికి ముందుగా అధికార మీడియా ప్రకటించింది.

ఉ.కొరియా శుక్రవారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను సముద్రంపైకి ప్రయోగించినట్లు సమీప పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్‌ కూడా ధ్రువీకరించాయి. ఇవి 410 కిలోమీటర్ల మేర ప్రయాణించి సముద్రంలో పడిపోయాయని ద.కొరియా సైన్యం తెలిపింది.ఉత్తర కొరియాపై కరోనా ప్రభావానికి సంబంధించి బయటి ప్రపంచానికి ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఆ దేశంలో కరోనా కేసులు భారీగా∙ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు