ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి పరీక్ష

15 Sep, 2017 08:24 IST|Sakshi


సాక్షి, టోక్యో: 
అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడాలని ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలన్నీ కోరుతున్నప్పటికీ ఉత్తర కొరియా అణు పరీక్షల నిర్వహణను మాత్రం ఆపటం లేదు. తాజాగా శుక్రవారం మరోసారి క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. 
 
ఉ.కొ. ప్రయోగించిన క్షిపణి జపాన్‌ మీదుగా ప్రయాణించి ఫసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయింది. కాగా, ప్యోంగ్‌ యాంగ్‌ విమానశ్రయం నుంచి  ఈ శక్తివంతమైన బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ చర్యను జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబే తీవ్రంగా ఖండించారు. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను సహించే ప్రసక్తే లేదని అబే తెలిపినట్లు జపాన్‌ స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.
 
ఐరాస కొత్తగా  ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. తాజా ప్రయోగం నేపథ్యంలో దక్షిణ కొరియా అత్యవసర సమావేశం నిర్వహించింది. సుమారు 770 కిలోమీటర్ల ఎత్తులో. 3700 కిలోమీటర్లు ప్రయాణించి క్షిపణి సముద్రంలో పడిపోయినట్లు ద.కొ. భద్రతా దళాల చీఫ్ తెలియజేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.