సియోల్: ఉత్తర కొరియా మరోసారి ఆయుధ పరీక్షలను నిర్వహించింది. తమ నేత కిమ్ జొంగ్ ఉన్ శనివారం కొత్త ఆయుధ పరీక్షలను స్వయంగా పర్యవేక్షించారని ఆ దేశ మీడియా వెల్లడించింది. అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు సాగిస్తున్న దక్షిణ కొరియాతో చర్చలు జరిపేది లేదని, ఇకపై అమెరికాతో మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది. అమెరికాతో త్వరలో చర్చలు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తరకొరియా ఆదివారం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అమెరికా, దక్షిణ కొరియాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక విన్యాసాలు ముగిసిన తర్వాత అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ కిమ్ సంసిద్ధత వ్యక్తం చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఉత్తర కొరియా ఈ మేరకు స్పందించింది. (చదవండి: మళ్లీ అణ్వాయుధ పోటీ!)