సౌదీ అరేబియా సంచలన నిర్ణయం

27 Feb, 2018 09:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రియాద్‌ : సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు కూడా ఆర్మీలో చేరవచ్చంటూ చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రియాద్‌, మక్కా, అల్‌-ఖాసిం, మదీనా తదితర ప్రొవిన్సెస్‌ల సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని.. అందుకు గురువారం(మార్చి 1వ తేదీ) ఆఖరు రోజని ప్రకటించింది. ఆర్మీలో చేరాలనుకునే మహిళలు దరఖాస్తులో 12 అంశాలను తప్పకుండా పూరించాలని తెలిపింది. సౌదీ జాతీయురాలై ఉండటం.. 25-35 ఏళ్ల మధ్య వయస్సు.. హైస్కూలు విద్యార్హత కలిగి ఉండాలి. వైద్య పరీక్షలు చేసుకోవడం తప్పనిసరని పేర్కొంది. ఇక శారీరక ధారుఢ్యం విషయంలో అభ్యర్థి వయసు 155 సెంటీమీటర్లకు తగ్గకూడదని తెలిపింది. వీటితోపాటు ఇతరత్రా నిబంధనలను విధించింది. అయితే గార్డియన్‌ అనుమతితోనే ఆమె సైన్యంలో చేరాలన్న నిబంధనపై మాత్రం మహిళా హక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

ఇక ఈ నియామకం యుద్ధంలో పోరాటడం కోసం కాదని.. తాము సైన్యంలో రాణించగలమన్న భావన మహిళలలో పెంపొందించేందుకేననని అధికారులు చెబుతున్నారు. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్‌ చేయటంపై నిషేధం ఎత్తివేత, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు