ఎన్నారై యువకులు సాయం చేయబోయి...

12 Dec, 2016 14:53 IST|Sakshi
వినీత్
ఏదో సమస్య వచ్చి ఆగిపోయిన కారు యజమానికి సాయం చేద్దామని కిందకు దిగిన ఇద్దరు ఎన్నారై యువకులలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేటకు చెందిన వినీత్ రెడ్డి, తరుణ్ అనే ఇద్దరు యువకులు అమెరికాలో ఉంటున్నారు. అక్కడే ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లిద్దరూ కారులో ప్రయాణం చేస్తుండగా.. దారిలో వేరే కారు ఆగిపోయి కనపడింది. అత్యవసరంగా ఏవైనా మరమ్మతులు వచ్చినప్పుడు వాహనాలను నిలుపుకొనేందుకు ఉద్దేశించిన 'షోల్డర్' ప్రాంతంలో ఆ కారు ఆగి ఉంది. 
 
దాంతో ఆ కారు యజమానికి సాయం చేద్దామని వినీత్, తరుణ్ తమ కారు లోంచి కిందకు దిగారు. ఆగిన కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన ఓ భారీ ట్రక్కు వీరిద్దరినీ ఢీకొట్టింది. దాంతో వినీత్ అక్కడికక్కడే మరణించాడు. తరుణ్ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు