పిల్లలు లేటుగా నిద్రపోతున్నారా.. జర జాగ్రత్త!

15 Jul, 2016 15:26 IST|Sakshi
పిల్లలు లేటుగా నిద్రపోతున్నారా.. జర జాగ్రత్త!

న్యూయార్క్: ఉదయాన్నే లేవడం చిన్నారులతో పాటు ఆఫీసుకు వెళ్లే పెద్దవాళ్లకు కాస్త బద్దకంగా అనిపిస్తోంది. అయితే స్కూల్‌కు వెళ్లే పిల్లల్లో చాలామంది ఉదయం లేవడానికి మారాం చేస్తుంటారు. ఇందుకు కారణం చాలా చిన్నదే. రాత్రిపూట త్వరగా పడుకోకపోవడమే. ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక ఊబకాయంతో పాటు ఇతర రోగాల బారినపడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓహియో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 977 మంది పిల్లలపై అధ్యయనం చేసి ఆ వివరాలను వెల్లడించారు.

పిల్లలు ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే రాత్రికి త్వరగా నిద్రపోయేలా చూడటమే సరైన మార్గమని సూచిస్తున్నారు. రాత్రి 8 గంటలలోపు పడుకోబెట్టడడం, ఉదయం త్వరగా లేపడం వల్ల ఉబకాయం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని వివరించారు. రాత్రి 9 గంటలు దాటాక నిద్రపోయే పిల్లలు ఊబకాయంతోపాటు అనేకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనంలో కూడా రుజువైంది. ఉదయం త్వరగా లేచే పిల్లలు ఎక్కువ మంది ఆరోగ్యంగా, పాజిటివ్ దృక్పథంతో ఉంటారని తేలింది.

మరిన్ని వార్తలు