ఐక్యరాజ్య సమితి: భారతదేశంలో 2018లో దాదాపు 11.6 లక్షల కేన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవిత కాలంలో ప్రాణాంతక కేన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేన్సర్ బారిన పడిన వారిలో ప్రతి 15 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందని తెలిపింది. 2018లో దాదాపు 11.6 లక్షల కేన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు పేర్కొంది.
వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్వో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ) సంస్థలు మంగళవారం రెండు నివేదికలు విడుదల చేశాయి. కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా ఎజెండా రూపొందించడంతో పాటు కేన్సర్పై పరిశోధన, నివారణలపై ఈ నివేదికలు ప్రధాన దృష్టి సారించాయి. సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో రాబోయే 20 ఏళ్లలో మధ్య ఆదాయ దేశాల్లో కేన్సర్ మరణాల రేటు 60 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది.