వాషింగ్టన్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ) ప్రధాన కార్యాలయం సోమవారం ఉలిక్కిపడింది. మేరీలాండ్లోని ఈ కార్యాలయ ప్రాంగణంలోకి ఇద్దరు వ్యక్తులు అనుమతి లేకుండా దూసుకొచ్చేందుకు యత్నించడంతో గేటు వద్దే భద్రతా సిబ్బంది వారిపైకి కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.
ఇది ఉగ్రవాద చర్య కాకపోవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. కీలక విభాగాలు ఉండే ఈ ఆఫీసులో 11 వేల మంది మిలటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. 29 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఘటనపై అధికారులు అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వివరించారు.