‘16వ ఏటనే అత్యాచారానికి గురయ్యాను’

26 Sep, 2018 09:07 IST|Sakshi
పద్మా లక్ష్మి(ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌ : ‘నేను నా పదాహారో యేట అత్యాచారానికి గురయ్యాను.. నా పై ఈ అఘాయిత్యం చేసింది ఎవరో బయటి వారు కాదు. నాకు బాగా తెలిసిన వ్యక్తి.. నేను బాగా నమ్మిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు. కానీ ఇంత వరకూ ఈ విషయాన్ని కనీసం మా అమ్మతో కూడా చెప్పుకోలేదు.. అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల్ని వెల్లడించారు ప్రముఖ భారతీయ - అమెరికా టీవీ యాంకర్‌ పద్మాలక్ష్మి. బాల్యం నుంచి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు.. వాటి పర్యవాసనాలు.. ఇన్నేళ్లు వాటి గురించి మాట్లాడకపోవడానికి గల కారణాలను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో చెప్పుకొచ్చారు.

‘నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు.. ఓ 23 ఏళ్ల యువకుడితో డేటింగ్‌ చేసాను. మా బంధం ప్రారంభమయ్యి కొన్ని నెలలు కూడా గడవకముందే అతడు నా మీద అత్యాచారం చేశాడు. అంటే ఒక పురుషుడు.. కేవలం తన లైంగిక అవసరాలు తీర్చుకోవడం కోసమే స్త్రీతో బంధాన్ని కోరుకుంటాడా.. తనను నమ్మి వచ్చిన స్త్రీని ఓ బానిసగా చూస్తాడా.. ఆమె ఇష్టాఇష్టాలతో పని లేదా అనిపించింది. ఆ సమయంలో నాకు నేనే చాలా బలహీనురాలిగా తోచాను. నాపై అత్యాచారం జరిగిందనే విషయం గురించి కనీసం మా అమ్మతో కూడా చెప్పుకోలేక పోయాను’ అంటూ అందుకు గల కారణాన్ని వివరించారు.

ఈ విషయం గురించి పద్మాలక్ష్మి మాట్లాడుతూ..‘ఒక వేళ ఈ విషయం మా అమ్మతో చెప్తే ఏం జరిగేదో నాకు తెలుసు. అప్పుడు నాకు ఏడేళ్లు.. నా సవతి తండ్రి బంధువు నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయం గురించి నేను మా అమ్మతో చెప్పాను. కానీ ఆమె వెంటనే నన్ను ఓ ఏడాది పాటు భారతదేశంలో ఉన్న మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించింది. అంటే ఎవరో తప్పు చేస్తే.. దాని ఫలితం నేను అనుభవించాను. అదేంటో మగవాడు చేసిన తప్పుకు సమాజం ఆడవారిని నిందిస్తుంది.. వారినే శిక్షిస్తుంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు.

‘కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే.. నేను పడిన బాధ నా కూతురు పడకూడదు. తను ఏ సమస్య గురించైనా ధైర్యంగా నాతో చెప్పుకోవాలి. నేను తనకు తోడుగా ఉన్నాననే నమ్మకం తనకు కల్పించాలి. ప్రతి తల్లి కూడా ఇలానే చేయాలి. ఎందుకంటే పిల్లలకు, తల్లిదండ్రులకంటే ఆప్తులు వేరే ఎవరూ ఉండరు కదా..!’ అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు