పైలెట్ల పేర్లు వెల్లడించిన పాక్‌

7 Mar, 2019 11:13 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్‌.. పాకిస్థాన్‌ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. భారత్‌ చర్యలతో రెచ్చిపోయిన పాక్‌ మన సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు యత్నించింది. ఈ దాడిలో మిగ్‌ 21 యుద్ధం విమానం కూలిపోగా.. అభినందన్‌ వర్థమాన్‌ పాక్‌ భూభాగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కానీ పాక్‌ మాత్రం రెండు భారత యుద్ధ విమానాలకు కూల్చినట్లు చెప్పుకుంటుంది. తాజాగా భారత యుద్ధ విమానాలను కూల్చిన ఫైటర్‌ పైలెట్లను గుర్తించినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ విషయాన్ని స్వయంగా పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి పాక్‌ పార్లమెంట్‌లో వెల్లడించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ వైమానిక దళం రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేసింది. దానిలో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చిన వ్యక్తి స్వ్కాడ్రన్‌ లీడర్‌ హసన్‌ సిద్దిఖీ కాగా మరొకరు.. నమౌన అలీ ఖాన్‌గా గుర్తించమ’న్నారు. అయితే ఈ దాడిలో పాక్‌ పైలెట్‌ హసన్‌ సిద్దిఖీ మరణించాడని ఖురేషి తెలిపాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన సిద్దిఖీకి పాక్‌ పార్లమెంట్‌ నివాళులర్పించింది. అంతేకాక తాము కూల్చిన రెండు భారత యుద్ధ విమానల్లో ఒకటి జమ్మూకశ్మీర్‌లో కూలగా మరోటి పాక్‌ ఆక్రమిత్‌ కశ్మీర్‌ భూభాగంలో కూలిట్లు గతంలో పాక్‌ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.

(చదవండి : పాకిస్తాన్‌ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్‌)

మరిన్ని వార్తలు