పాక్‌పై ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలం

5 May, 2017 12:57 IST|Sakshi
పాక్‌పై ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలం

కరాచీ: పాకిస్థాన్‌లో ఉత్తర కొరియా రాయబారి, అతడి భార్యపై దాడి జరిగింది. స్వయంగా పాక్‌ చెందిన పన్నుశాఖ అధికారులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికెళ్లి మరీ వారిని కొట్టారు. ఈ ఘటనపై ఇప్పుడు ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాత్రం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని, కచ్చితంగా దెబ్బతింటాయని హెచ్చరించింది. పాక్‌ ఎక్సైజ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ అధికారులకు ఉత్తర కొరియా రాసిన లేక ప్రకారం.. పాక్‌ పన్నుశాఖకు చెందిన పదిమంది అధికారులు ఆయుధాలు ధరించి కరాచీలోని ఉత్తర కొరియా రాయబారి ఇంటికెళ్లారు.

అనంతరం రాయబారిపై దాడి చేయడమే కాకుండా అతడి భార్యను జుట్టుపట్టుకొని ఈడ్చి ఇద్దరిని కొట్టారు. వారి తలపై తుపాకులు ఎక్కు పెట్టి తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా గోడకు ఉన్న ఫొటోలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఏప్రిల్‌ 9న చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసును తీవ్రంగా భావించిన ఉత్తర కొరియా అంతర్గత వ్యవహారాల మంత్రి పాక్‌కు తీవ్ర హెచ్చరికత లేఖ రాశారు. ఇప్పటికే తామొక ఉన్నత స్థాయి కమిటీని వేశామని, అరెస్టు చేయకుంటే మాత్రం తామే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి తమకు నచ్చిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కరాచీలో దాడికి గురైన రాయబారి నిర్వహిస్తున్న విధుల వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు