కరడుగట్టిన 12మంది ఉగ్రవాదులకు ఉరి

11 Feb, 2016 18:57 IST|Sakshi
కరడుగట్టిన 12మంది ఉగ్రవాదులకు ఉరి

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో కరడుగట్టిన 12 మంది ఉగ్రవాదులకు ఉరి శిక్ష విధించినట్లు పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. వీరిని త్వరలోనే ఉరి తీయనున్నట్లు తెలిపింది. వీరంతా కూడా హీనాతిహీనమైన నేరాలకు పాల్పడినవారేనని ఈ సందర్భంగా వివరించింది. దేశంలో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా, బన్ను జైలు గోడలు బద్ధలు కొట్టడం, సైనికులపై దాడులకు తెగబడటం, ప్రజలపై, చట్టసభలపైన బాంబులతో దాడులు చేయడంవంటి పనులు చేసినట్లు పాక్ ఆర్మీ వివరించింది.

ఈ నేరాలకింద అరెస్టు చేసిన వీరికి ఇప్పటికే మిలటరీ కోర్టులు ఉరి శిక్షను విధించాయని, ఆ శిక్షను ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ ఆమోదించారని పేర్కొంది. 'గురువారం ఆర్మీ చీఫ్ 12మంది కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఉరి శిక్షను ఖరారు చేశారు. వీరంతా కూడా హీనమైన నేరాలకు పాల్పడిన వారే' అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. 2014 డిసెంబర్ 16న పెషావర్ లోని ఓ పాఠశాలపై బాంబుదాడికి పాల్పడి 150మందిని వీరు పొట్టనపెట్టుకున్నారు. అక్కడ చనిపోయినవారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు