ఇమ్రాన్‌ ఖాన్‌.. జర ఇస్లామాబాద్‌ వైపు చూడు : పాక్‌ కుర్రాడు

4 Sep, 2019 16:43 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక​ ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దుపై అంతర్జాతీయ సమాజంలో మద్దతు లభించకపోయినా... ఈ అంశంలో పాకిస్తాన్‌ తలదూర్చుతూనే ఉంది. భారత్‌పై విమర్శలు గుప్పించడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ఏదో ఒక రూపంలో భారత్‌పై బుదరజల్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్వదేశంలో పాలను వదిలేసి మరీ కశ్మీర్‌ అంశంలో తలదూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాక్‌ ప్రధాని  ఇమ్రాన్‌పై ఆదేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతున్నా... ఇమ్రాన్‌ పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. కశ్మీర్‌ అంశాన్ని వదిలిపెట్టి ఇస్లామాబాద్‌ వైపు చూడాలంటూ  ఓ పాక్‌ కుర్రాడు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉందని పాక్‌ ప్రజలు గుర్తించాలి. వాణిజ్య పరంగా భారత్‌ చాలా ప్రభావంతమైన దేశం. భారత్‌ స్థాయికి పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుగనంత వరకూ ఆ దేశంతో పోల్చుకోకూడదు. ఆర్థిక పరంగా ఇండియాను పాక్‌ ఢీకొట్టనంతవరకూ కశ్మీర్‌ అంశం పరిష్కారం కాదు. కాబట్టి ఇమ్రాన్‌ ఖాన్‌ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. కశ్మీర్‌ అంశాన్ని పక్కన పెట్టి దేశం వైపు చూడాలి. ఇమ్రాన్‌ ఖాన్‌  పాకిస్తాన్‌ ప్రధాని అన్న విషయం గుర్తించుకుంటే మంచిది’ అని కుర్రాడు మాట్లాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కశ్మీర్‌ అంశంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్‌ వ్యాఖ్యల పట్ల ఆదేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీర్‌ అంశంలో ఇమ్రాన్‌ తీరును  ఆ దేశానికే చెందిన ముత్తహిదా కౌమి మూవ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు ఆల్తారీ హుస్సేన్‌ తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని తన మద్దతు  ప్రకటించిన విషయం విధితమే.

మరిన్ని వార్తలు