అందుకే ఈ జువెల్లరీ: పాక్‌ వధువు

20 Nov, 2019 10:53 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఓ యువతి తన పెళ్లి వేడుకలో వినూత్న ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. బంగారానికి బదులు టమోటాలతో తయారైన జువెల్లరీ ధరించి వార్తల్లోకెక్కింది. వివరాలు.. పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన ఓ యువతికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆమె పెళ్లి వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా బంగారు వర్ణపు గాగ్రా ధరించిన సదరు యువతి... పాపిట బిళ్ల, హారం, గాజులు, చెవి దుద్దులు ఇలా అన్నీ కూడా టమోటాలతో కూడిన ఆభరణాలే ధరించింది. 

ఈ విషయం గురించి సదరు యువతిని ఓ విలేకరి ఇంటర్వ్యూ చేయగా... ‘ బంగారం ధరలు అంబరాన్ని అంటుతున్నాయి. అంతేకాదు టమోటా ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకే నా పెళ్లికి బంగారు ఆభరణాలకు బదులు టమోటాలతో కూడిన ఆభరణాలు ధరించాలని నిశ్చయించుకున్నా అంటూ సమాధానం ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో.. పెళ్లి కూతురి హాస్య చతురత అద్భుతం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేసిందని.. నిజంగా తన పెళ్లి జరుగుతున్నట్లయితే చేతులకు మెహందీ ఎందుకు లేదంటూ లాజిక్కులు వెదికే పనిలో పడ్డారు. ఇక పసిడి ధర రూ. నలభై వేలకు చేరువలో ఉండగా.. పాకిస్తాన్‌లో కిలో టమోటాల ధర 300 రూపాయలట. ఏదైమేనా ఈ కొత్త జువెల్లరీ భలే అందంగానూ, ప్రత్యేకంగానూ ఉంది కదా.. ఏమంటారు అమ్మాయిలు?!

>
మరిన్ని వార్తలు