‘కొత్త రకం అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న పాక్‌’

14 Feb, 2018 03:26 IST|Sakshi

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ కొత్త రకం అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మంగళవారం హెచ్చరించారు. వాటిలో స్వల్ప శ్రేణి ఆయుధాలు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రమాద తీవ్రత పెరుగుతోందని డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డ్యాన్‌ కోట్స్‌ కాంగ్రెస్‌కు చెప్పారు. సముద్రం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణులు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు కూడా పాక్‌ తయారుచేస్తున్న వాటిలో ఉన్నాయన్నారు.

అమెరికాకు ఉత్తర కొరియా తలనొప్పిగా మారనుందని కోట్స్‌ పేర్కొన్నారు. ఇరాన్, సిరియా తదితర దేశాలకు కూడా ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి సాంకేతికతను ఇవ్వడం ద్వారా ఈ ప్రమాదకర టెక్నాలజీలను వ్యాప్తి చేయాలని అనుకుంటోందని స్పష్టమవుతోందని కోట్స్‌ అన్నారు. 2016, 17ల్లో ఉత్తర కొరియా వరుసగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఉత్తర కొరియా జీవ ఆయుధాలు, రసాయనిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తాము అంచనావేస్తున్నామని కోట్స్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు