ఇస్లామాబాద్: చైనాకు గత ఐదేళ్లలో లక్ష కేజీలకు పైగా కురులను ఎగుమతి చేసినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఎగుమతి చేసిన మానవ వెంట్రుకల విలువ 132,000 డాలర్లకు పైగా ఉంటుందని తెలిపింది. గత ఐదు సంవత్సరాల్లో 105,461 కిలోల కురులను చైనాకు పంపినట్టు పాకిస్తాన్ వాణిజ్య, ఔళి మంత్రిత్వ శాఖ జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేసిందని ‘డాన్’ పత్రిక వెల్లడించింది. చైనాలో మేకప్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందడంతో కురులకు డిమాండ్ పెరిగింది.
విగ్గులు ధరించడం ఫ్యాషన్గా మారడం కూడా వెంట్రుకలకు డిమాండ్ పెరగడానికి కారణమని ప్రముఖ బ్యుటీషియన్ ఏఎం చౌహన్ తెలిపారు. స్థానికంగా కురులకు డిమాండ్ తగ్గిపోవడం చైనాకు ఎగుమతులు పెరగడానికి మరో కారణమని వివరించారు. ఎగుమతిదారులు లోకల్ సెలూన్ల నుంచి నాణ్యమైన కురులను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అత్యంత నాణ్యమైన కురులను అమెరికా, జపాన్ దేశాలకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. ఇదే సమయంలో హెయిర్ ఎక్స్టెన్షన్లు, విగ్గులు పాకిస్తాన్కు దిగుమతి అవుతున్నాయన్నారు.