మోదీని కాదని..మన్మోహన్‌కు పాక్‌ ఆహ్వానం

30 Sep, 2019 15:49 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని విస్మరించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించాలని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గురునానక్‌ దేవ్‌ సమాధి నెలకొన్న దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ భారత్‌, పాకిస్తాన్‌లు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. ఈ కారిడార్‌ ద్వారా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ మసీదుతో పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ను అనుసంధానం చేస్తారు. రావి నదీ తీరంలోని కర్తార్‌పూర్‌కు భారత యాత్రికులు వీసా లేకుండా చేరుకునేందుకు అనుమతిస్తారు. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా నవంబర్‌లో ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌పై విద్వేషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌పై ఇమ్రాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత వివాదం రాజేస్తోంది.

మరిన్ని వార్తలు