పాక్‌ గేమ్‌ ఇక చెల్లదు!

3 Jan, 2018 08:59 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ ఏళ్లుగా డబుల్‌ గేమ్‌ ఆడుతోందని, పాక్‌ తన వైఖరి మార్చుకోకపోవడం వల్లే.. ఆ దేశానికి ఇవ్వాలని భావించిన 255 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేశామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్‌కు 255 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అమెరికా నిలిపివేసింది. ఇందుకు కారణాలు సుస్పష్టం. పాకిస్థాన్‌ ఏళ్లుగా డబుల్‌ గేమ్‌ ఆడుతోంది’ అని ఆమె అన్నారు.

ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ.. మద్దతుగా నిలుస్తుండటంతోనే పాకిస్థాన్‌కు పూర్తిస్థాయిలో నిధులు నిలిపేయాలన్న తీవ్ర నిర్ణయానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చారని తెలిపారు. ‘కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్‌ మాతో కలిసి పనిచేసింది. అదే సమయంలో ఆఫ్గనిస్థాన్‌లో మాపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. పాక్‌ ఆడుతున్న ఈ గేమ్‌ మాకు ఆమోదయోగ్యం కాదు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌ నుంచి ఎక్కువ సహకారాన్ని ఆశిస్తున్నాం’ అని ఆమె తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ఆఫ్ఘన్‌లో తమకు ఏమాత్రం సహాయం చేయడం లేదని మండిపడుతూ.. తాజాగా అధ్యక్షుడు ట్రంప్‌ పాక్‌కు అందజేసే సహాయ నిధులను పూర్తిగా నిలిపేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు