భారత్‌ నుంచి పాక్‌కు భారీగా దిగుమతి

27 Jul, 2019 08:27 IST|Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశమైన పాకిస్తాన్‌, భారత్‌ నుంచి భారీ స్థాయిలో టీకాలను దిగుమతి చేసుకుంది. గత 16 నెలల్లో రూ. 250 కోట్ల విలువ చేసే యాంటీ–రేబిస్, యాంటీ–వీనమ్‌ వ్యాక్సీన్లను కొనుగోలు చేసినట్లు ది నేషన్‌ వార్తాపత్రిక గురువారం కథనాన్ని ప్రచురించింది. భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్న టీకాల వివరాలు, స్వదేశంలో తయారు చేస్తున్న టీకాల వివరాలను తెలపాల్సిందిగా, పాక్‌ సెనెటర్‌ రెహ్మాన్‌ మాలిక్‌ ఆ దేశ జాతీయ ఆరోగ్య సేవలు విభాగాన్ని కోరారు. దీనికి సమాధానంగా ఎన్‌హెచ్‌ఎస్‌ ఓ నివేదికను ఆయనకు అందించింది. తయారీకి తగిన వనరులు లేనందునే వ్యాక్సీన్లను భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌–పాక్‌ల మధ్య  ద్వైపాక్షిక సమస్యలు ఉన్నప్పటికీ వీటి దిగుమతి మాత్రం కొనసాగుతోంది.

50 శాతం కుటుంబాలకు ఆకలికేకలే!  
కరాచీ: పాకిస్తాన్‌ పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో కనీసం రెండు పూటలా పోషకాహారం తీసుకోలేని కుటుంబాలు 50 శాతానికి పైగా ఉన్నాయని శుక్రవారం ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ ఓ కథనం ప్రచురించింది. పేదరికం వల్ల పిల్లలు పోషకాహార లేమికి గురయ్యారని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘జాతీయ పోషకాహార సర్వే 2018’ తెలిపినట్లు ఆ కథనం వెల్లడించింది. పిల్లల ఆరోగ్య స్థితిని అధికారులకు తెలియజేయడమే లక్ష్యంగా 4 ప్రావిన్సుల్లో ఈ సర్వే జరిగింది. 

>
మరిన్ని వార్తలు