బడ్జెట్‌కు పాక్‌ ఆర్మీ స్వచ్ఛంద కోత

6 Jun, 2019 04:34 IST|Sakshi

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు మద్దతిస్తూ పాక్‌ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌కు కేటాయించే నిధులను స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎస్‌పీఆర్‌) డీజీ మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ చెప్పారు. ‘దేశ భద్రత, రక్షణ విషయాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోం. అన్ని ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించాలి. ముప్పులను దీటుగా ఎదుర్కొగలిగేలా సామర్థ్యాన్ని కొనసాగించాలి. బడ్జెట్‌లో కోత వల్ల కలిగే ఇబ్బందులను త్రివిధ దళాలు తగిన అంతర్గత చర్యల ద్వారా సర్దుబాటు చేసుకుంటాయి. దేశంలోని గిరిజన ప్రాంతాలు, బలూచిస్థాన్‌ అభివృద్ధిలో పాలుపంచుకోవడమే మాకు ముఖ్యం’ అని ఆసిఫ్‌ అన్నారు. పాకిస్తాన్‌ ఆర్మీ నిర్ణయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసించారు. పలు భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ దేశం కోసం వారు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.

మరిన్ని వార్తలు