డబ్ల్యూటీవో సమావేశానికి పాక్‌ దూరం

18 Mar, 2018 03:27 IST|Sakshi

ఇస్లామాబాద్‌: వచ్చే వారం ఢిల్లీలో జరిగే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమావేశానికి తాము వెళ్లటం లేదని పాకిస్తాన్‌ తెలిపింది. తమ రాయబార కార్యాలయం అధికారులను భారత్‌ వేధిస్తున్నందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈనెల 19, 20వ తేదీల్లో ఢిల్లీలో డబ్ల్యూటీవో మంత్రుల స్థాయి అనధికారిక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అమెరికా, చైనా తదితర 50కి పైగా దేశాల ప్రతినిధులు హాజరై వ్యవసాయం, సేవల రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి వాణిజ్య మంత్రి పర్వేజ్‌ మాలిక్‌ను పంపరాదని నిర్ణయించినట్లు పాక్‌ తెలిపింది. దీంతోపాటు ఢిల్లీలోని రాయబారి సొహైల్‌ మహ్మూద్‌ను పాక్‌ వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు