మత గురువుల ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్ సర్కారు
20 అంశాల ప్రణాళికతో ప్రార్థనలకు అనుమతి
ఇస్లామాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ నేపథ్యంలో మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం విదితమే. ముఖ్యంగా రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు రద్దు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఇతర వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఇదే బాటలో నడిచిన పాకిస్తాన్ తాజాగా యూటర్న్ తీసుకుంది. రంజాన్ మాసం మొదలుకానున్న తరుణంలో షరతులతో మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మత గురువులతో ఆన్లైన్లో చర్చలు జరిపిన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే మతపెద్దలు ఇందుకు ససేమిరా అనడంతో ప్రభుత్వం వారి ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. (భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం)
ఈ నేపథ్యంలో 20 అంశాల ప్రణాళిక ప్రతిపాదించి.. అధ్యక్షుడు మత గురువులను ఒప్పించారు. మసీదుల్లో తారావీ ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతించామన్న ఆయన... ప్రార్థనా సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో మసీదుల్లో పాటించాల్సిన నిబంధనల గురించి మార్గదర్శకాలు జారీచేశారు.(అమెరికా కంటే అధ్వాన్నంగా: బిలావల్ భుట్టో)