తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రసంస్థ ప్రకటన
కరాచీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను హత్య చేసింది తామేనని పాక్లోని తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. ‘ఇంక్విలాబ్ మెహ్సూద్ సౌత్ వజీరిస్థాన్’ అనే పుస్తకంలో తాలిబాన్ ఈ విషయాన్ని వెల్లడించిందట. ఈ పుస్తకాన్ని తాలిబాన్ నేత అబూ మన్సూర్ అషీమ్ ముఫ్తీ రాశాడు.
ఉగ్రవాదులు చేసిన ఘోరాలను వివరిస్తూ 2017 నవంబర్ 30న ప్రచురించిన ఈ పుస్తకం ఆదివారం విడుదలైంది. 588 పేజీలున్న ఈ పుస్తకంలో పలువురు తాలిబాన్ నేతలు, వారు చేసిన ఘోరాలను ప్రచురించారు. బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రాముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి బాంబుల ద్వారా భుట్టోను చంపినట్లు ఈ పుస్తకంలో వెల్లడించారు. మొదట భుట్టోపై కాల్పులు జరిపింది బిలాలేనని, అనంతరం తనకు తాను కాల్చుకున్నాడని రాశారు. ఆత్మాహుతి అనంతరం ఇక్రాముల్లా తప్పించుకున్నాడట.
అయితే బుట్టో హత్య వెనుక లాడెన్ హస్తం ఉన్నట్లు గతంలో నిఘావర్గాలు వెల్లడించాయి. బెనజీర్ హత్యకు యత్నం జరుగుతోందన్న సమాచారం అందుకున్న హోంశాఖ, దానిని అడ్డకునే ప్రయత్నం ఏది చేయలేదనే వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా లాడెన్తో హత్య చేయించింది ముషారఫ్ అని ఆరోపణలు సైతం వచ్చాయి.