వైరల్‌: లైవ్‌లో కశ్మీర్‌పై చర్చిస్తుండగా...

19 Sep, 2019 16:39 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మీడియా సోషల్‌ మీడియాకు కితకితలు పెడుతోంది. ఎప్పటికప్పుడు దాయాది నుంచి గమ్మత్తైన వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మొన్నటికి మొన్న భారత్‌లో పాకిస్తాన్‌ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్‌ బాసిత్‌.. బ్లూఫిల్మ్‌ స్టార్‌ ఫొటోను పెట్టి.. పెల్లెట్ల దాడిలో ఓ కశ్మీరీ అంధుడయ్యాడంటూ ట్వీట్‌ చేసి అభాసుపాలయ్యారు. పాక్‌ రైల్వే మంత్రి షైక్‌ రషీద్‌ అహ్మద్‌ మోదీ గురించి, భారత్‌ గురించి విషం కక్కుతుండగా.. మైక్రోఫోన్‌ ద్వారా ఆయనకు షాక్‌ తగిలిన వీడియో కూడా ఇటీవల వైరల్‌ అయింది. ఇక, పాక్‌ న్యూస్‌ యాంకర్‌ యాపిల్‌ కంపెనీ గురించి మాట్లాడుతుండగా.. యాపిల్‌ పండు అనుకొని పొరబడటం అప్పట్లో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తింది. తాజాగా ఓ పాకిస్థాన్‌ న్యూస్‌ చానెల్‌లో ఇదేరీతిలో కడుపుబ్బా నవ్వించే ఘటన చోటు చేసుకుంది. లైవ్‌ డిబేట్‌లో కశ్మీర్‌ అంశంపై సీరియస్‌గా మాట్లాడుతుండగా.. ఓ రాజకీయ విశ్లేషకుడు అమాంతం కుర్చీలోంచి జారి దభేల్మని కిందపడిపోయారు. ఎనిమిది సెకన్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు