సాక్షి, ఇస్లామాబాద్: జూలై 25వ తేదీన జరుగనున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వామపక్ష ‘అవామీ వర్కర్స్’ పార్టీ విడుదల చేసిన వీడియో సాంగ్ అటు పాకిస్థాన్ ప్రజలను ఇటు యూట్యూబ్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘చెహరే నహీ సమాజ్ కో బదులో’ అంటూ సాగే ఈ పాటలో సమాజంలో పాలకులు కొనసాగిస్తున్న అణచివేతకు ప్రజలు ఎలా బలవుతున్నది వివరిస్తున్నది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో సూచిస్తుంది. ముఖాలను మార్చినంత మాత్రాన దేశంలో వేళ్లూనుకు పోయిన దోపిడీ వ్యవస్థ మారదని, మొత్తం సమాజాన్నే మార్చమంటూ పిలుపునిస్తోంది.
పాకిస్థాన్ సింగర్, ప్రముఖ ఆర్థికవేత్త సహ్రామ్ అజర్ స్వయంగా రాసి పాడగా, ‘అవామీ వర్కర్స్’ పార్టీ తరఫున ఇస్లామాబాద్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అమ్మర్ రషీద్, గిటార్పై గాయకుడికి సహకరించడం విశేషం.