ఇజ్రాయెల్‌ దాడుల్లో తల్లి, కూతురు మృతి

5 May, 2019 05:31 IST|Sakshi

గాజా సిటీ: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌ నుంచి పదుల సంఖ్యలో రాకెట్ల ప్రయోగం, ప్రతిగా ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడుల్లో తల్లి, ఆమె కూతురు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. శనివారం మధ్యాహ్నం గాజాలోని హమాస్, ఇస్లామిక్‌ జిహాదీ సంస్థలకు చెందిన దళాలు సుమారు 150 రాకెట్లు తమ భూభాగంపైకి ప్రయోగించాయని ఇజ్రాయెల్‌ తెలిపింది. పదుల సంఖ్యలో రాకెట్లను రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకోగా మరికొన్ని నిర్జన ప్రాంతంలో పడిపోయాయని పోలీసులు తెలిపారు. వీటి వల్ల ఇద్దరు గాయపడ్డారన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలోని మూడు ప్రాంతాల్లో 30 లక్ష్యాలపై ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఒక గర్భవతి(37), ఆమె ఏడాది కూతురు చనిపోగా 10 మంది వరకు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సైనికాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. మరోవైపు, ఈజిప్టు కూడా ఏప్రిల్‌ 9వ తేదీన ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం కొనసాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  

మరిన్ని వార్తలు