ప్రపంచవ్యాప్తంగా పనామా ప్రకంపనలు!

5 Apr, 2016 10:38 IST|Sakshi
ప్రపంచవ్యాప్తంగా పనామా ప్రకంపనలు!

లండన్‌: 'పనామా పేపర్స్‌' ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, తాజా మాజీ దేశాధ్యక్షులు.. ఇలా చాలామంది పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో అక్రమంగా నల్లడబ్బు దాచినట్టు వెలుగులోకి వచ్చిన వివరాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విచారణ ప్రారంభించాయి. పనామాలోని ఓ లా కంపెనీకి చెందిన 1.15 కోట్ల పత్రాలు లీకవ్వడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్‌ సన్నిహితులు, బ్రిటన్ ప్రధాని కామెరాన్‌, చైనా ప్రధాని జింగ్‌పింగ్ బంధువులు, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కొడుకులు, ఉక్రెయిన్ ప్రధాని కుటుంబసభ్యులు అక్రమంగా విదేశీ బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. వీరితోపాటు ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల నల్లడబ్బు లోగుట్టు కూడా వెలుగుచూసింది.  

నల్లడబ్బును దాచేందుకు బోగస్ కంపెనీలు సృష్టించడంలో పనామాకు చెందిన మొసాక్‌ ఫొనెస్కా లా కంపెనీ దిట్ట. ఆ కంపెనీ ఇప్పటివరకు వివిధ ప్రముఖుల కోసం 2.40 లక్షల బోగస్ కంపెనీలు సృష్టించింది. అనేకమంది ప్రముఖులు ఈ కంపెనీల్లో నల్లడబ్బును దాచినట్టు వెలుగులోకి వస్తున్నది. లియోనల్ మెస్సీ, జాకీచాన్‌, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా మొదలు బ్రిటన్ వరకు అన్ని దేశాలు ఈ బాగోతంపై స్పందించాయి. పుతిన్ సన్నిహితుల నల్లడబ్బు వ్యవహారంపై రష్యా స్పందిస్తూ.. ఇందులో కొత్తదనంకానీ, సమగ్ర ఆధారాలుకానీ లేవని కొట్టిపారేసింది.

ప్రధాని డేవిడ్ కామెరాన్‌ దివంతగ తండ్రికి కూడా ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించింది. ఇది ప్రైవేటు మ్యాటర్‌ కాబట్టి స్పందించబోమని పేర్కొంది. తన సన్నిహితుల పేర్లు 'పనామా పేపర్స్'లో ఉండటంపై ఐస్‌లాండ్ ప్రధాని సిగ్ముందర్‌ గున్లలగ్సన్‌ నోరువిప్పలేదు. తన కుటుంబసభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివరణ ఇచ్చారు. ఇక తమ దేశాల ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌, స్వీడన్, నెదర్లాండ్ తదితర దేశాలు విచారణకు ఆదేశించాయి. మరోవైపు పనామా దేశం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లీక్‌ బాగోతంగా భావిస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు