వెన్నెముకకు పక్షవాతం వచ్చినా నడవొచ్చు!

23 Jul, 2018 11:56 IST|Sakshi

నూతన చికిత్సను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు  

బోస్టన్‌: వెన్నెముకకు గాయమై పక్షవాతం బారిన పడి నడక సామర్థ్యాన్ని కోల్పోయిన వారిని తిరిగి నడవగలిగేలా చేసే చికిత్సను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన చికిత్సను ఎలుకలపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలతో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ చికిత్సను మానవులపై ప్రయోగించి సత్ఫలితాలను పొందవచ్చని వారు భావిస్తున్నారు. వెన్నెముకకు గాయమైన ప్రదేశం కింది భాగం పక్షవాతం బారిన పడి అత్యధికులు నడక సామర్థ్యాన్ని కోల్పోతున్నారని వివరించారు.

గాయం కాని వెన్నుముక భాగాలు ఎందుకు పనిచేయకుండా పోతున్నాయో తెలుసుకునేందుకు గాను అమెరికాలోని బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా సీఎల్పీ 290 అనే మిశ్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇంట్రాపెరిటోనియల్‌ ఇంజెక్షన్‌ ద్వారా ఎలుకలకు ఎక్కించారు. అనంతరం నాలుగైదు వారాల్లో ఎలుకల్లో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. ఈ మిశ్రమం కారణంగా కాలి వెనుక భాగాల్లో కదలికలు ఏర్పడినట్లు ఎలక్ట్రోమయోగ్రఫీ రికార్డులో స్పష్టమైనట్లు వివరించారు.

మరిన్ని వార్తలు